రానున్న గణేష్ పండుగను పురస్కరించుకొని గణేష్ బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ జోన్ ల డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీ లు, ఇన్ స్పెక్టర్లతో, ట్రాఫిక్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, ఎస్ఓటీ తదితర అధికారులతో ఈరోజు సీపీ ఆఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతవరణంలో జరగాలన్నారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
నిమజ్జనానికి వచ్చే వారితో మర్యాదగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇన్ స్పెక్టర్లు అన్ని శాఖలతో, హైదరాబాద్ ఎం పోలీసులతో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు.
డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాలన్నారు. సీసీటీవీ ల పై దృష్టి సారించాలన్నారు. అదే విధంగా విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్ ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., డీసీపీ బాలానగర్ పీవీ పద్మజా, డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు, ఎస్ఓటీ డీసీపీ సందీప్, ఏడీసీపీలు, ఏసీపీలు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.