ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. మంత్రి కాక ముందు ఆయన ఐఆర్ఎస్ అధికారి. ఆయన భార్య టీఎన్ విజయలక్ష్మి కూడా ఐఆర్ఎస్ అధికారిణే. వారిద్దరిపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో సీబీఐ అధికారులు 2016లో దేశవ్యాప్తంగా పలువురు ఐఆర్ఎస్ అధికారుల ఇళ్లపై దాడులు చేశారు.
ఈ క్రమంలో విజయలక్ష్మిపై కేసు నమోదు చేసి, 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిలో విజయలక్ష్మిని ప్రధాన నిందితురాలిగా, సురేశ్ను రెండో నిందితునిగా పేర్కొన్నారు. అయితే.. తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీబీఐ ఎలాంటి ప్రాథమిక విచారణ జరపలేదని, దీనిని కొట్టి వేయాలని కోరుతూ.. సురేశ్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలితకుమారి.. ప్రాథమిక విచారణ చేపట్టకుండానే ఎఫ్ఐఆర్ను నమోదు చేశారని పేర్కొంటూ.. ఫిబ్రవరి 11న దీనిని తోసిపుచ్చింది. అయితే.. ఈ తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై బుధవారం జరిగిన విచారణలో సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు.
అన్ని ఆధారాలతోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఆయా విషయాలను అఫిడవిట్లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. మరోసారి ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది.