సైబరాబాద్ పరిశోధనలో పోలీసు సిబ్బంది అన్ని రకాల నైపుణ్యాలను కలిగి ఉండాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నూతనంగా శిక్షణ పూర్తి చేసుకున్న స్టేషన్ రైటర్లకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సీపీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్టేషన్ రైటర్లకు శిక్షణలో భాగంగా అనేక అంశాల్లో ట్రెయినింగ్ ఇచ్చినట్లు తెలిపారు.
అందువల్ల వారు ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్లుగా ఇన్చార్జి ఆఫీసర్లు, ఎస్ఐలు, సీఐలతో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే నేర పరిశోధన, భిన్న రకాల నేరాలు, సాక్ష్యాలను సేకరించడం, సీన్ రికార్డింగ్, రిమాండ్ రిపోర్టులు, చార్జి షీట్లు రూపొందించడం, 5 డబ్ల్యూలు, 1 హెచ్ తదితర అంశాలపై పోలీస్ కానిస్టేబుల్స్కు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే వారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు స్టేషన్లలో బాధ్యతలు నిర్వర్తిస్తారని అన్నారు. కొత్తగా రిక్రూట్ అయిన మొత్తం 224 మంది స్త్రీ, పురుష పోలీస్ కానిస్టేబుల్స్కు ఈ సందర్భంగా వీడ్కోలు పలికారు. నవంబర్ 5వ తేదీ నుంచి సోమవారం వరకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో వారు పాల్గొని ఆయా అంశాల్లో శిక్షణ పొందారు. ఈ సందర్భంగా వారికి సీపీ సజ్జనార్ వారికి ధ్రువ పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, అడిషనల్ డీసీపీ క్రైమ్స్-1 డి.కవిత, సీటీసీ ప్రిన్సిపాల్ ఎం.పద్మనాభ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.