ఇప్పటికే తమ అందం కోసం చాలామంది ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలుమార్లు ఆయా చికిత్సలు వికటించి తీవ్రరూపం దాల్చి ప్రాణాల మీదకు తెస్తున్నాయనే వార్తలను కూడా చాలానే చదివాం.
ఇలాంటి ఒక నిజమైన ఘటనను చూద్దాం.
25 ఏళ్ల సెవంకీ సెక్లిక్ అనే యువతి తన ముక్కును అందంగా మార్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ కోసం ఇస్తాన్బుల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సందర్శించింది. ఆ అమ్మాయికి ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేసి విజయవంతంగా ముక్కును అందంగా మార్చి రెండు గంటల్లో ఇంటికి పంపించి వేశారు. కానీ ఆ యువతి ఇంటికి వెళ్లిన రెండు గంటల అనంతరం తీవ్రమైన జ్వరం వచ్చింది. జ్వరం తగ్గడం కోసం తిరిగి అదే ఆసుపత్రిని సంప్రదించగా ఇది మాములేనని ఒకటి రెండు రోజుల్లో జ్వరం తగ్గుతుందని వైద్యులు తెలిపారు. ఎంత ప్రయత్నించినా జ్వరం తగ్గకపోవడంతో ఓ వారం తరువాత తిరిగి ఆసుపత్రికి రాగా సర్జరీ నిర్వహించిన సిబ్బంది, వైద్యులను యాజమాన్యం తొలగించిన విషయాన్ని తెలుసుకున్న యువతి అవాక్కయ్యింది. అప్పటికే ఆ యువతి శరీరం నల్లబడి యువతి రెండు పాదాలు విషపూరితంగా మారాయి. ఇక వేరే ఆసుపత్రిని సంప్రదించగా అక్కడి వైద్యులు కాళ్లు తీసేయాల్సిందేనని లేకుంటే యువతి ప్రాణాలను కాపాడలేమని కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. చేసేదేమీ లేక ఆ యువతి కాళ్లను తొలగించారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించిన ఆసుపత్రిపై కేసు పెట్టారు. కాగా ఇదే విషయంపై ఆసుపత్రి కూడా తమ వాదనను కోర్టుకు బలంగా వినిపించడంతో ఆ కేసు ఇంకా నడుస్తోంది. ఈ ఘటన 2014లో జరిగింది.
ఏది ఏమైనా భగవంతుడిచ్చిన అందాన్ని, శరీరాక్రతిని కాదనుకొని అందంగా కనబడాలనే ఆశ కాస్త ఆ యువతి ప్రాణానికి సంకటంగా మారింది. ప్లాస్టిక్ సర్జరీలు చేసుకునేవారు ఇలాంటి విషయాలను ద్రష్టిలో ఉంచుకుంటే బెటర్.