అర్హులైన వారికి మాత్రమే దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ దళితులు ప్రభుత్వాన్ని కోరారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన దళితులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టగా పోలీసులు బారికేడ్లతో అడ్డుకోగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధిత దళితులు మాట్లాడుతూ.. గ్రామంలో 500 దళిత కుటుంబాలు ఉన్నాయని, సుమారు 200 కుటుంబాలు దళితబందుకు అర్హులు ఉన్నారన్నారు.
గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వారి అనుకూల వ్యక్తులకే దళితబంధు ఇప్పించారని తెలిపారు. గ్రామంలో 15 మందికి దళితబంధు వచ్చినా అందులో ఒక్కరు కూడా అర్హులు లేరన్నారు. అర్హత ఉన్నవాళ్లలో డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారని, అలాంటి వారికి దళితబంధు వర్తింపజేస్తే ఏదైనా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా ఎదుగుతారని తెలిపారు. బీఆర్ఎస్ లో ఉన్నవాళ్లకు మాత్రమే దళితబంధు వచ్చేలా చేస్తామని, ఇతర పార్టీల వారికి ఇవ్వమని బహిరంగానే చెప్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి విచారణ చేసి అర్హులకే దళితబంధు ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు