ఓటరు తుది జాబితాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల విడుదల చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2 ప్రణాళిక పూర్తి అయ్యిందని చెప్పారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఓటరు జాబితా సవరణ, ముసాయిదా ఓటరు జాబితా విడుదల, జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, ప్రత్యేకంగా ఓటు నమోదుకు శిభిరాల నిర్వహణ, ఓటు నమోదు, తొలగింపులు, మార్పులకు దరఖాస్తులు స్వీకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో గత నెల 19వ తేదీ వరకు మొత్తం 68703 దరఖాస్తులు రాగా క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అంతర్జాలంలో నిక్షిప్తం చేసినట్లు చెప్పారు. దాని ఆధారంగా తుది ఓటరు జాభితాను రూపొందించామని చెప్పారు. జిల్లాలోని ఐదు నియోజకర్గాలలోని 1095 పోలింగ్ కేంద్రాల్లో 945094 మంది ఓటర్లున్నట్లు చెప్పారు. వీరిలో 461315 మంది పురుషులు, 483741 మంది మహిళలు, 38 మంది ట్రాన్స్ జండర్లు ఉన్నట్లు చెప్పారు. ఓటరు జాభితాలో 14130 మంది దివ్యాన్గులు, 22096 మంది 18-19 వయస్సు గ్రూపు వారు, 13082 మంది 80 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులను గుర్తించినట్లు చెప్పారు. ఎన్ఆర్ఐలు 43 మంది, 731 సర్వీస్ ఓటర్లున్న ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలోభాగస్వాములైన ప్రతి ఒక్కరిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.