అక్రమార్జనకు, ప్రత్యర్థులను వేధించడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకోరాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ తూళ్ల దేవేందర్ గౌడ్.. రాజ్యసభ, శాసనసభల్లో చేసిన ప్రసంగాల ఆధారంగా రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ సభ బుధవారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు.
రాజకీయాల్లో అధికార, విపక్ష నేతలు ప్రత్యర్థులుగా ఉండాలే గానీ శత్రువులుగా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ద్వేషపూరిత, కుట్రపూరిత రాజకీయాలు వద్దని చెప్పారు. ప్రజాతీర్పును, ప్రతిపక్షాలను గౌరవించాలన్నారు.