కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని మోడేగాం గ్రామానికి చెందిన నవ దంపతులు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన భట్టు సతీష్(24) ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ లోని హోటల్ లో క్యాటరింగ్ పని చేస్తున్నాడు.
ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ఠాకూర్ మహిమ అనే అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు నిన్న హైదరాబాద్ లో వివాహం చేసుకుని బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి 9 గంటల ప్రాంతంలో బస్సు దిగి స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొని వెళ్లిపోగా ప్రమాద స్థలంలోనే మహిమ మృతి చెందింది. సతీష్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన పోలీసులు వారి వాహనంలో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
తీవ్ర గాయాలైన సతీష్ ను నిజామాబాద్ తరలించగా రాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు