రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన తండ్రి మరణం తట్టుకోలేక పోయింది ఆ ఆడ కూతురు. ఆవేదన చెందింది. ఏం చేయాలో తెలియని క్షణికావేశంలో గోదావరి నదిలో దూకింది. తనువు చాలించింది ఆ అమ్మాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు కు చెందిన అరవెల్లి వసంతం సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తక్షణమే ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
ఆసుపత్రి నుంచి వసంతం మృతదేహాన్ని వాహనంలో తీసుకెళ్తుండగా, కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్న వసంతం కుమార్తె ఆరవెల్లి సాయి ప్రియ (32) గోదావరిఖని గంగానగర్ గోదావరి బ్రిడ్జి వద్ద రాగానే తనకు వాంతులు వస్తున్నాయి వాహనాన్ని ఆపని కోరింది. వాంతులు వస్తున్నాయి అనడంతో గోదావరి బ్రిడ్జి పై వాహనాన్ని ఆపారు. దాంతో సాయి ప్రియ కిందికి దిగి కుటుంబ సభ్యుల కళ్లెదుటే గోదావరి నదిలో దూకింది.
నదిలో కళ్లముందే సాయి ప్రియ మునిగిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం జరిగిన సంఘటన ఇక్కడ అందరిని కలచివేసింది. సాయి ప్రియ మంచిర్యాల జిల్లా కోటపల్లి ఎస్సీ ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది.