విద్యుత్ శాఖ లో డి ఈ గా పనిచేస్తున్న అధికారి ఆస్తుల విలువ 100 కోట్లకు పైనే. ఇటీవల ఏ సి బి దాడులలో దొరికిన మిర్యాలగూడెం విద్యుత్ శాఖ డి ఈ మురళీధర్రెడ్డి ఇంటి పై ఏసిబి అధికారులు దాడులు చేయగా కళ్లు బైర్లు కమ్మే నిజాలు కనిపించాయి. రూ. కోట్ల విలువైన భూముల కాగితాలు, తోటల వివరాలు, ఆస్తుల దస్తావేజులతో పాటుగా బంగారు, వెండి, డైమండ్ ఆభరణాలు కనిపించాయి. వాటన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 100 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మురళీధర్ రెడ్డి మిర్యాలగూడలో టెక్నికల్ ఏఈగా పనిచేయడంతో పాటుగా, హాలియాలో ఏఈగా, దేవరకొండ ఏడీఈగా, చౌటుప్పల్ డీఈగా పనిచేశారు. దేవరకొండకు చెందిన శివకుమార్ పేరిట బినామీ లైసెన్స్ తెరిచి ఆయన పనిచేసిన ప్రతిచోటా రూ. కోట్లతో పనులు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లీవ్ రెగ్యులరైజ్ చేసేందుకు లైన్మెన్ నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ డీఈ, యూడీసీ, జేవోలు ఇటీవల రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
మిర్యాలగూడలోని రెడ్డికాలనీ లైన్మెన్ గుంటూరు శ్రీనివాస్ పని చేస్తున్నాడు. తన కుమారుడి అనారోగ్యం కారణంగా 2004 నవంబరు 23 నుంచి సెలవుపై వెళ్లాడు. తిరిగి 2005 నవంబరు 14న పాలకవీడు లైన్మెన్గా విధుల్లో చేరాడు. అయితే 350 సెలవు రోజుల లీవ్ రెగ్యులరైజేషన్తోపాటు, ఇంక్రిమెంట్లు, లీవ్ పీరియడ్కు సంబంధించిన రూ.7 లక్షల ఎరియర్స్ ఇస్తూ పదోన్నతి కల్పించాలని శ్రీనివాస్ డీఈ కి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు డీఈ మురళీధర్రెడ్డి, యూడీసీ లతీఫ్, జేవో దామోదర్లు రూ.7 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మొదటి విడతగా రూ.2లక్షల నగదుతో డీఈ చాంబర్కు వెళ్లాడు. అక్కడ మురళీధర్రెడ్డి. లతీఫ్, దామోదర్లతో కలిసి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కాగా ఏసీబీ దాడిలో పట్టుబడ్డ అధికారుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నల్లగొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చిన 45 మంది అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. హైదరాబాద్లో మురళీధర్రెడ్డికి చెందిన ఇంట్లో, నల్లగొండలోని లతీఫ్, దామోదర్ ఇళ్లలో సోదాలు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి అధిక మొత్తంలో ఆస్తుల వివరాలు కనుగోన్నారు.