కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సరళీకరణ పేరుతో ప్రైవేటీకరణకు దూకుడుగా అమలు చేస్తుందని, కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు ఐక్యం కావాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కార్మికులకు పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిఐటియు కార్యాలయం వద్ద ఐ ఎన్ టి యు సి, సి ఐ టి యు రైస్ మిల్ డ్రైవర్ల గేట్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రోష పతి మాట్లాడుతూ ఈనెల 31వ, తేదీ నాటికి రైస్ మిల్ డ్రైవర్లు అగ్రిమెంట్ పూర్తవుతుందని, రైస్ మిల్ అసోసియేషన్ కార్మికులకు వేతనాలు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ఈనాడు నిత్య అవసర వస్తువులు అధికంగా పెరిగాయని, కూరగాయలు, ఉల్లిగడ్డలు కొనే పరిస్థితి లేదని అన్నారు. దీనికి అనుగుణంగా కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు. స్థానిక డ్రైవర్లను అందరినీ ముందుగా పనిలోకి తీసుకున్న తర్వాతనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రైవర్లను తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకులు సలిగంటి జానయ్య, సైదులు, కొండలు, సిఐటియు నాయకులు గుండెబోయిన వెంకన్న ,మల్లేష్ వెంకన్న ,పర్వతాలు, శ్రీను, ఉపేందర్ ,తదితరులు పాల్గొన్నారు.