వైసిసి నేతలు అబద్దాల సాయంతోనే రాజకీయాలు చేస్తున్నారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అబద్దాలతో వారు వ్యాపారాలు చేశారని, అబద్దాలతో వైసిపి నేతలు అధికారంలోకి వచ్చారని ఆయన అన్నారు. వైసిపి నేతల బతుకే అబద్దంగా మారిందని ఆయన అన్నారు.
చంద్రబాబునాయుడు మాజీ పిఎస్ శ్రీనివాస్ పై ఐటి దాడులు జరిగితే అందులో రెండు వేల కోట్లు దొరికినట్లు వైసిపి నేతలు సాక్షి పత్రికలో ప్రచారం చేశారని అయితే అక్కడ దొరికింది రూ 2లక్షల నగదు కొన్ని నగలు మాత్రమేనని తేలిందని ఆయన అన్నారు. ఈ మేరకు పంచనామా నివేదిక బయటకు వచ్చిందని దీనికి వైసిసి నేతలు ఏం సమాధానం చెబుతారని యనమల ప్రశ్నించారు.
ఐటి దాడులపై వైసిపి నేతల విమర్శలన్నీ అబద్దాలేనని, సాక్షి మీడియా దుష్ప్రచారం అంతా అబద్దమేనని తేలినట్లు ఆయన చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలన్న నోళ్లు ఇప్పుడెందుకు మూతబడ్డాయి? అంటూ ఆయన ప్రశ్నించారు. టిడిపిపై చేసిన దుష్ప్రచారానికి లీగల్ గా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. వైసిపి నేతలపై, సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన వెల్లడించారు. ప్రెస్ కౌన్సిల్ కు, ఎడిటర్స్ గిల్డ్ కు ఫిర్యాదులు చేస్తామని, వైసిపి నేతలను, సాక్షి మీడియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని యనమల అన్నారు.