ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు 26.36 శాతం నమోదు అయింది. ఎన్నో పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లు క్యూలైన్ లలో వేచి ఉన్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ముక్కోణపు పోటీ ఉన్న 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 672 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఈ ఎన్నికలలో 1.47 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంది. నేటి ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 2015 అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే తాము అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. సివిల్ లైన్స్ ప్రాంతంలోని రాజ్ పూర్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ పోలింగ్ కేంద్రంలో ఆయన నేడు కుటుంబ సభ్యులతో సహా కలిసి వచ్చి ఓటు వేశారు. పోలింగ్ ప్రారంభం కావడానికి నిమిషాల ముందు కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ, ‘ ప్లీజ్ గో టు కాస్ట్ ఓట్.
మహిళలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి-మీ భుజంపైన ఇంటి బాధ్యతే కాదు, దేశం, ఢిల్లీ బాధ్యత కూడా ఉంది”అంటూ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీ సీటు నుంచి పోటీ చేస్తున్న కేజ్రీవాల్ ఓటింగ్ కు వెళ్లే ముందు తన తల్లిదండ్రుల ఆశీస్సులను తీసుకున్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేష్ వర్మ, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ కూడా తమ హక్కును ఉపయోగించుకున్నారు. కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, హర్దీప్ సింగ్ పురి కూడా ఓటు వేసినవారిలో ఉన్నారు.