అమరావతి భూములలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని బలంగా నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై లోతైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించింది. అమరావతి భూముల కొనుగోలు పై దూకుడు పెంచిన సి ఐ డి ఒక్క రోజులోనే ఏడు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
నేడు సిఐడి అధికారులు ఐటీ చీఫ్ కమీషనర్ కు లేఖ రాశారు. అమరావతిలో అసైండ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని ఐటీ చీఫ్ కమీషనర్ ను ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి.సునీల్ కుమార్ కోరారు. భూమి కొనుగోలు చేసిన 106 మంది పై తదుపరి చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు.
వీరంతగా 2018 నుండి 2019 వరకు అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారు. వీరిలో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు తో పాటు నారాయణ కూడా ఉన్న విషయం తెలిసిందే. వీరిపై ఇప్పటికే సి ఐ డి కేసు నమోదు చేసింది. తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అయిన రైతులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సి ఐ డి కేసులు నమోదు చేసిన వారిలో 1.అబ్దుల్ జమేదార్, 2.కొండలరావు పొలినేని. 3.మండవ నాగమణి 4.మండవ అనురాధ 5.బొల్లినేని నరసింహ రావు 6.భూక్యా నాగమణి ఉన్నారు. రూ.2 లక్షలకు మించి జరిగిన అనుమానిత ట్రాన్షక్షన్లపై విచారణ జరపాలని ఐటీ అధికారులకు ఏపీ సిఐడి విజ్ఞప్తి చేసింది. ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైండ్ భూముల అమ్మకాలు, కొనుగోలులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సిఐడి కోరింది. లేఖతో పాటు ఎక్సెల్ షీట్లో 106 మంది అసైండ్ భూముల కొనుగోలులో ఉన్న వ్యక్తుల పూర్తి వివరాలు, లాండ్ అడ్రస్లు, సర్వే నెంబర్లతో సహా ఐటీ చీఫ్ కమీషనర్ కు పంపించారు.