ప్రజాతంత్ర లౌకిక శక్తులను గెలిపించాలని ప్రజలను మరిచి పాలన చేస్తున్న పాలకులను ఓడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపు నిచ్చారు. నవంబరు 30న జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధి నిరోధక, అవినీతి పార్టీలకు, లౌకిక శక్తులకు మధ్య పోరాటం జరుగుతుందన్నారు. ఖమ్మం నియోజక వర్గ సమావేశం సోమవారం స్థానిక గిరిప్రసాద్ భషన్లో జరిగింది. బండి సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
కేంద్రంలోని బిజెపి మతోన్మాదంతో వ్యవహరిస్తుంటే కేసిఆర్ నియంతలా పాలిస్తున్నారన్నారు. దేశ భవిష్యత్తు, వర్తమాన రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగాలని సిపిఐ నిర్ణయించుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తో అవగాహనతో ముందుకు పోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. రాజకీయ అవగాహన మేరకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నడుచుకోవాలని ఆయన సూచించారు. పొత్తు ధర్మాన్ని అన్ని విధాలా పాటిద్దామని ఆయన కోరారు. కొత్తగూడెం నియోజక వర్గానికి సంబంధించి సిపిఐ అభ్యర్థిగా ఈనెల ఎనిమిదవ తేదీ ఉదయం 10 గంటలకు కొత్తగూడెంలో నామినేషన్ వేయనున్నట్లు సాంబశివరావు తెలిపారు.
నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నియోజక వర్గ కన్వీనర్ కె జానిమియా, నాయకులు పోటు కళావతి, మహ్మద్ సలాం, మేకల శ్రీనివాసరావు, పగడాల మల్లేష్, వెంకటాయపాలెం సర్పంచ్ రావెళ్ల మాధవి తదితరులు పాల్గొన్నారు.