రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో అక్రమ మద్యం రవాణా దందా విచ్చలవిడిగా సాగుతోంది. స్వయంగా మంత్రి సోదరుడిపైనే దీనికి సంబంధించిన ఆరోపణలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అక్రమ మద్యం సరఫరా చేస్తుండగా మంత్రి సోదరుడి కారు డ్రైవర్ తెర్నేకల్ అంజిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ అరెస్టుతో వచ్చిన మొత్తం సమాచారం చూస్తే స్పెషల్ ఎన్ ఫోర్సు మెంటు అధికారులకే కళ్లు తిరిగాయి. అరెస్టు అయిన డ్రైవర్ మొత్తం ఐదు మంది వైసీపీ నాయకులు అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు వెల్లడించాడు.
అంజి కన్ఫెషన్ రిపోర్టు ఆధారంగా వెలమకూరు రాము, తెర్నేకల్ గురుపాదం, కరి వేముల వీరేశ్, లకం దిన్నె తిరుమలేష్, కోటకొండ లక్ష్మన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరికొందరు కూడా అక్రమ మద్యం రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది. దాంతో వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లాలో అదీ కూడా మంత్రి కి సంబంధించిన వారు పట్టుపడటం సంచలనం కలిగిస్తున్నది.
స్పెషల్ ఎన్ ఫోర్సు మెంట్ అధికారులు మరింత చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే మరింత మంది వైసిపి నాయకులు అక్రమ మద్యం కేసుల్లో దొరికేందుకు అవకాశం ఉందని జిల్లా వాసులు అంటున్నారు.