బీసీ కులాల అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యమని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్ లో బిసి బంధు పథకంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిసిల అభివృద్ధికి ఇది ఆరంభమని చెప్పారు. పధకం అమలులో భాగంగా తొలి విడతలో కొత్తగూడెం నియోజకవర్గంలో 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. మలివిడతలో మరో వెయ్యి మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పథకం అమలుతో బీసీ కులాల లబ్ధిదారులు ఆర్థిక అభివృద్ధి సాధనకు అవకాశం ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ బిసి కులవృత్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన బీసీ బందు పథకం బిసి ల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. తొలి విడతలో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గంలో 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు.
కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారి అభివృద్ధికి ఇదొక మంచి పదకమని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు విడతలవారీగా పథకం అమలు జరుగుతుందని చెప్పారు. ఎంపిక కాబడిన లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పథకంలో చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కులవృత్తులు ప్రారంభించాలని చెప్పారు. అనంతరం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామాలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పి వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్ ధర్మరాజు, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, ఎస్సి కార్పొరేషన్ ఈ డి సంజీవ రావు, మున్సిపల్ కమిషనర్ రఘు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.