27.7 C
Hyderabad
May 11, 2024 10: 11 AM
Slider వరంగల్

పాలకుర్తి కేంద్రంగా దేవాలయాలతో టూరిజం హబ్ అభివృద్ధి

#Errabelli Dayakar

పాలకుర్తి నియోజకవర్గానికి అత్యంత ప్రాచీన చారిత్రక విశిష్టత ఉన్నదని, ఈ చరిత్రను కాపాడి, మరింత అభివృద్ధి చేసి భావితరాలకు అందించే లక్ష్యంతో పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయాన్ని, పాల్కురికి సోమనాథుని క్షేత్రాన్ని, వాల్మీడీ వాల్మీకి గుట్టను, బమ్మెర పోతన పుట్టిన స్థలాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

ఈరోజు పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనం చేసుకుని, పాలకుర్తి పనులను పరిశీలించి, అక్కడి నుంచి వల్మిడి వెళ్లి, అక్కడ పనులను పర్యవేక్షించారు. అనంతరం చెన్నూరు దేవాలయాన్ని సందర్శించి, అక్కడి నుంచి వాన కొండయ్య లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర అభివృద్ధి పనులను ప్రారంభించి, బొమ్మర పోతన జన్మస్థానానికి చేరుకున్నారు. అనంతరం పాలకుర్తి నియోజకవర్గం కేంద్రానికి వచ్చి అధికారులతో సమీక్ష చేశారు.

శివరాత్రి నాటికి పాలకుర్తి సోమనాథుని విగ్రహం, స్మృతి వనం పూర్తి కావాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు. మార్చి 30వ తేదీ శ్రీరామనవమి నాటికి వల్మిడి ఆలయ పనులు పూర్తి చేయాలని వాల్మీకి 22వ అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని చెప్పారు.

మొదట్లో 40 లక్షల రూపాయలు అనుకున్న వాల్మీకి విగ్రహం ఇప్పుడు మూడు కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయం పెరిగిందని, అయినా దానికున్న ప్రాశస్త్యం మేరకు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. బమ్మెర క్షేత్రంలోని పనులను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రోద్బలంతోటే బమ్మెర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు అందాయని చెప్పారు. పనులు పూర్తయిన వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి తో ప్రారంభం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దేవరుప్పుల మండలంలోని దేవుని గట్ట తండా గ్రామపంచాయతీలో కొలువైన వాన కొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

వాన కొండయ్య ఆలయం వద్ద గోపురం నిర్మించాలని, మెట్లు విశాలం చేయాలని, కళ్యాణమండపం నిర్మాణం చేయాలని, స్నాన ఘట్టాలు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.శివరాత్రికి పాలకుర్తిలో జరిగే ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ప్రచారం చేయాలని ప్రతి ఇంటి నుంచి నీటిని తీసుకొచ్చి శివునికి అభిషేకం చేయించాలని స్థానిక నాయకులకు సూచించారు. ఇందులో మహిళ గ్రూపులను భాగస్వామ్యం చేసి కరపత్రాల ద్వారా ఇంటింటికి ప్రచారం చేసే విధంగా కార్యా చరణ రూపొందించి, అమలు చేయాలన్నారు.

అదేవిధంగా శ్రీరామరావు నాటికి రాముల వారి కళ్యాణానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రతి ఇంటి నుంచి తలంబ్రాలు తీసుకొచ్చి కళ్యాణంలో పాల్గొనేలా ప్రచారం నిర్వహించాలన్నారు. వెనుకట బండ్లు కట్టుకుని జాతరకు వచ్చినట్టు రాములవారి కళ్యాణానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని మన పూర్వీకుల చరిత్రను తెలుసుకోవాలని కోరారు. ఈ ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు ఆలయాల రహదారులను డబుల్ రోడ్లుగా మార్చాలని పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. పాలకుర్తి లో ఉన్న చారిత్రక ప్రసిద్ధ కవుల గురించి, ఆలయాల గురించి విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ కు సూచించారు.

ఈ కార్యక్రమంలో టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ రావు, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, జనగామ కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, దేవాదాయ శాఖ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, టూరిజం, రెవిన్యూ శాఖల రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

ఎట్రాషియస్: మైనర్ బాలికపై ముగ్గురి దుర్మార్గం

Satyam NEWS

మూగజీవాల దప్పిక తీరుస్తున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్

Satyam NEWS

పెను విషాదం: సొల్లు మాటలు వినే ఓపిక ఇకలేదు

Satyam NEWS

Leave a Comment