ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ క్షేత్రస్థాయిలో తణిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యెలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పనుల్లో అలసత్వం వహిస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
అనంతరం ఎర్రుపాలెం కస్తూరిబా గాంధీ విద్యాలయంను కలెక్టర్ పరిశీలించి విద్యార్ధులకు కల్పిస్తున్న సౌకర్యాల వివరాలను తెలుసుకొన్నారు. అదనపు భవనంను వినియోగించాలని, విద్యుత్ సరఫరాను మెరుగుపర్చాలని, నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అదనపు టాయిలెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్ధులకు మెను ప్రకారం పాలు, పెరుగు మంచి పౌష్టికాహరం అందించాలని పాఠశాల ప్రత్యేక అధికారి నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం విద్యార్థినిలతో కలిసి కలెక్టర్ బోజనం చేశారు.కలెక్టర్ వెంట శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ, ఎంపిడిఓ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఏడి అనురాధ, ఎంఈఓ ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు.