లంపి చర్మ వ్యాధి కారణంగా పశువులు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లీగల్ అసోసియేట్ రాయపురం మౌలయ్య నాయుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కమిషన్ ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. అక్టోబర్ 2022 నాటికి భారతదేశం అంతటా ఒక లక్షా 50 వేల జంతువులు ఈ వైరస్ కారణంగా చనిపోయాయి. దీని ఫలితంగా రైతులు చాలా కష్టాలు, పేదరికం, బాధలను ఎదుర్కొన్నారు.
దీంతో కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆర్ మౌలయ్య నాయుడు కోరారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎదుటకు కూడా కేసు రానున్నది. ఈ దశలో ఆయన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయించారు. లంపి వైరస్ కారణంగా చనిపోయిన జంతువుల యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.
దీనిపై తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శికి కమిషన్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ పూర్తి చేసిన కమిషన్ తుది ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం లంపి వైరస్ తో మరణించిన పశువులను వాటి యజమానుల జాబితా తయారు చేయాలని ఆదేశించింది. లంపి వైరస్ తో పశువులు మరణించినందున సంబంధిత యజమానులకు ఎంత మేరకు నష్ట పరిహారం చెల్లించాలనే విషయం రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కమిషన్ అభిప్రాయపడింది. లంపి వైరస్ పై న్యాయపోరాటం దేశంలో ఇదే తొలి కేసు.