సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని అతి ప్రాచీనమైన శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ఆదివారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రకాల వాహనాలపై శోభాయాత్రను వేలాది మంది భక్తుల నడుమ అత్యంత ఘనంగా జరుపుకున్నారు.
తెల్లవారుజాముననే హుజూర్ నగర్ పట్టణం లోని ప్రధాన వీధిని రంగు రంగుల రంగవల్లులతో అందంగా అలంకరించారు. శోభాయాత్రలో పెద్ద గరుడ వాహనంపై సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామి,చిన్న గరుడ వాహనపై ఉభయ దేవేరులైన రుక్మిణి,సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి,పల్లకిలో చక్ర పెరుమాళ్ళు, హనుమంత వాహనంపై శ్రీ ఆంజనేయు స్వామి,శేష వాహనంపై శ్రీమద్రామానుజులు,కల్పవృక్ష వాహనంలో గోదాదేవి అమ్మవారు,అశ్వ వాహనంపై శ్రీ నమ్మాళ్వారులు,హంస వాహనంపై పేరియాళ్వార్లు,గజ వాహనంపై విశ్వక్సేనుడు వేంచేసి వేలాది మంది భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రధాన వీధులలో 108 దివిటీలతో మహిళలు హారతులు పట్టగా కోలాట బృందం,భజనలతో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు.స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద కోలాట భజనలతో, అన్నమయ్య సంకీర్తనలతో,అర్చకుల వేద పఠనంతో,ఎదుర్కోలు,తిరుప్పావై,మంగళా శాసనం,మంగళహారతులు స్వామి అమ్మవార్లకు ఇచ్చారు. తిరిగి దేవేరులు దేవాలయానికి చేరుకున్న పిదప మహా నీరాజనం,మంత్రపుష్పం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ శోభాయాత్ర కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి,ఆలయ పాలకవర్గం,ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు,భక్తులు,పుర ప్రముఖులు,అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.