ఎల్ బి నగర్ ప్రాంతంలోని లింగోజీగూడా డివిజన్ ధర్మపురి కాలనీలో చిన్న వర్షానికికే మురుగు నీరు పొంగిపొర్లుతున్నది. వర్షం నీటితో బాటు మురుగు నీరు ఉప్పెనలా వస్తుండటంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాలనీ దిగు ప్రాంతంలోని ఓపెన్ నాలా అధ్వాన్నంగా మారింది.
ఆ నాలాలో మట్టి చెత్త పేరుకు పోవడంతో మురుగు నీరు సాఫీగా వెళ్లలేక అక్కడే ఆగిపోతుంది. దాంతో చిన్న వర్షానికే ఆ కాలవ పొంగుతున్నది. దీంతో ఆ కాలనీ మొత్తం దుర్వాసనతో బాటు అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. బైరామల్ గూడా చెరువు నుంచి అధికారి నగర్, ఆల్తాఫ్ నగర్ ల నుంచి వచ్చే మురుగు నీరు ధర్మపురి కాలనీని ముంచెత్తుతున్నది.
కొద్ది రోజుల కిందట ఎల్ బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఈ కాలనీని సందర్శించారు. అప్పుడు మురుగు నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు.