ఇంటి నుంచి తప్పిపోయిన ఓ చిన్నారి డయల్ 100 కాల్ తో తిరిగి తల్లితండ్రుల వద్దకు చేరిన ఘటన శనివారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జైజవాన్ నగర్ కాలనీకి చెందిన అమూల్ అనే వ్యక్తి ఇంటి దగ్గర అడుకుంటున్న తన రెండేళ్ల కూతురు ఆరాద్య (2) కనిపించడం లేదని ఆందోళనతో డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన కంట్రోల్ రూమ్ పెట్రో కార్ కానిస్టేబుల్ మిర్జా ఇసాక్ బేగ్ కు సమాచారం అందించారు. దింతో జై జవాన్ నగర్ కాలని కి చేరుకున్న కానిస్టేబుల్ మస్జిద్ లోకి వెళ్లి లౌడ్ స్పీకర్ లో తప్పిపోయిన బాలిక ఆనవాళ్లు తెలియజేశారు. పది నిమిషాల వ్యవధిలోనే స్థానికులు చిన్నారిని గుర్తించి కానిస్టేబుల్ కు అప్పగించారు.
అయన చిన్నారిని బాధిత తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. దింతో చిన్నారి తండ్రి అమూల్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్నారి కనిపించకపోవడంతో తాము చాలా ఆందోళనకు గురి అయ్యామని, డయల్-100 కు ఫోన్ చేసిన వెంటనే స్పందించి, పది నిమిషాల్లోనే బాలిక ఎక్కడున్నది గుర్తించి క్షేమంగా అప్పగించారని కొనియాడారు.
ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర, డిఎస్పి వెంకటేశ్వరరావు లు కానిస్టేబుల్ ను అభినందించారు, చాకచక్యంగా బాలికను గుర్తించడానికి మస్జిద్ లౌడ్ స్పీకర్ ను వినియోగించి తన వివేకాన్ని ప్రదర్శించాడాని కొనియాడారు. జిల్లా ప్రజలు, మహిళలకు ఏలాంటి ఆపదలు, సమస్యలు ఎదురైనా ముందుగా డయల్-100 ఫోన్ కాల్ చేయడం గుర్తించుకోవాలని సూచించారు.