ఆయిల్ పామ్ సాగు రైతు లబ్దిదారులను క్షేత్రస్థాయిలో గుర్తించి, సాగుకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, డ్రిప్ కంపెనీల ప్రతినిధులతో ఆయిల్ పామ్ సాగుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు కార్యాచరణకు జిల్లాలో మొత్తం 12100 ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 719 మంది రైతుల ద్వారా 3385.26 ఎకరాలను గుర్తించడం జరిగిందని అన్నారు. ఈ నెల చివరి లోగా లబ్దిదారులను గుర్తించాలని, ఇందుకోసం వ్యవసాయ విస్తరణ అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తూ రైతులకు అర్ధమయ్యే విధంగా ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కలిగించి ముందుకు వచ్చే విధంగా చూడాలని, వారి నుండి దరఖాస్తులు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం వరి కోతలు దాదాపు అన్ని చోట్ల పూర్తవుతున్నందున సంప్రదాయ సాగు నుండి అధిక ఆదాయం అందించే ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులను మళ్లించేందుకు ఇది మంచి తరుణమని, రైతు వేదికల ద్వారా రైతులను సమావేశపరచి ఆయిల్ పామ్ సాగు విధానాలు, పంట దిగుబడి, వచ్చే లాభాలను విశదీకరించాలని, ఆయిల్ పామ్ సాగు కోసం అందించే సబ్సిడీలను వివరించాలని ఆయన అన్నారు.
193 రూపాయల విలువ గల ఆయిల్ పామ్ మొక్కను సబ్సిడీపై రైతుకు 20 రూపాయలకు అందించడం జరుగుతుందని, తోటల నిర్వహణకు మొదటి నాలుగు సంవత్సరాలకు గాను హెక్టారుకు రూ. 5250 సంవత్సరానికి రాయితీ ఇవ్వడం జరుగుతుందని, అంతర పంటల సాగుకై మొదటి నాలుగు సంవత్సరాలకు గాను హెక్టారుకు రూ. 5250 చొప్పున సంవత్సరానికి రాయితీ ఇవ్వడం జరుగుతుందని, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి 80 శాతం నుంది 100 శాతం వరకు రాయితీ అందించబడుతుందనే విషయాలను క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలని, ఆయిల్ పామ్ సాగుకు సమాయత్తం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారిణి అనసూయ, ఏడిఏ సరిత, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, ఉద్యానవన అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, డ్రిప్ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.