ప్రసిద్ధ కాశీ క్షేత్రంలో జగన్మాత బంగారు అన్నపూర్ణాదేవి గా దర్శనం ఇచ్చింది. శుక్రవారంతో దీపావళి సంబరాలు ముగిశాయి. ఉత్సవం ముగింపు సందర్భంగా అమ్మవారికి 501 కేజీల 56 రకాల పిండివంటలు, 108 రకాల మిఠాయిలను ప్రసాదంగా నివేదించారు. ప్రాంగణంలో కొలువైన ఉత్సవమూర్తులకు కూడా నైవేద్యం సమర్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల దర్శనార్థం ఉంచిన తరువాత సాయంత్రం భక్తులకు వాటిని ప్రసాదంగా పంపిణీ చేశారు. బంగారు అన్నపూర్ణమ్మను శుక్రవారం సుమారు 50వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
బంగారు అన్నపూర్ణమ్మను ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి మందిరం మహంత్ శంకరపురి శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఉత్సవం జరిగిన ఈ ఐదు రోజులూ అమ్మవారి ప్రసాదంగా ధాన్యం, రూపాయి కాయిన్ భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.
బంగారు అన్నపూర్ణమ్మ ఆలయంలో నిత్యం 6వేల మందికి పైగా భక్తులకు అన్నసంతర్పణ గావించారు. కాశీలోని శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమంలో బస చేసిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఆశ్రమ సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగువారికి మరింత ఇతోధికంగా సేవలందించాలని సూచిస్తూ ఆశ్రమ మేనేజింగ్ ట్రస్టీ వి.వి.సుందరశాస్త్రిని అభినందించారు.