పోలీస్ వ్యవస్థ చట్ట పరిధిలో పనిచేస్తుందని, పోలీసుల మనోభావాలను గాయపరిచే విధంగా, రాజకీయ నాయకులు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.
సోమవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడారు.
ఇంద్రవెల్లి సభలో పోలీసులను విమర్శించిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి రాష్ట్ర అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి ప్రస్తావించిన మాటల్లో ఎలాంటి వాస్తవం లేదనన్నారు.
సభా స్థలానికి వచ్చే అన్ని వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి ప్రణాళిక ప్రకారం క్రమబద్ధీకరణ చేశామని ఆయన తెలిపారు.
పరిమితికి మించి భారీగా వచ్చిన వాహనాలను సైతం సమయస్ఫూర్తితో సాధారణ ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టిన జిల్లా పోలీసులను ప్రజాముఖంగా విమర్శలు చేయడం సరైంది కాదన్నారు,
ఇలాంటి చౌకబారు విమర్శలతో ప్రజల ఆదరణ పొందలేరని, ప్రజలకు అత్యవసర, ఆపద సమయంలో ఆదుకున్న ఘనత జిల్లా పోలీసులకున్నదని సూచించారు.
పోలీసుల పనితీరుపై జిల్లా ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ఇలాంటి అసత్య, కల్పితమైన మాటలను సభకు వచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితిల్లో లేరన్నారు.