అఖిల భారత విద్యార్థి సమైక్య AISF 85 వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని బుధవారం నాడు దేవరకొండ డివిజన్ కేంద్రంలో సీపీఐ ప్రజా భవన్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు జెండా ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ ఉద్యమాలలో ఉద్భవించి, పోరాటాలలో రాటుదేలి సామ్యవాద సమాజ స్థాపన కోసం అవిరళ త్యాగాలతో ఉద్యమాన్ని నిర్మిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ అని ఆయన అన్నారు.
“స్వాతంత్రం మా జన్మహక్క”ని భారతజాతి ఎలుగెత్తి నినదిస్తున్న తరుణంలో పొత్తిళ్లలోనే పిడికిలి బిగించి 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలనకు సమాధి కట్టడంలో అగ్రభాగాన నిలిచింది.
నాటి నుండి నేటి వరకు దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించడానికి పోరాటాల మార్గాన్ని ఎంచుకుంది. మార్క్సిజం లెనినిజం తన ఊపిరిగా, శాస్త్రీయ సోషలిజం తన గమ్యంగా, సెక్యులరిజాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం తన కర్తవ్యమని సమరశీల విద్యార్థి ఉద్యమాల నిర్మాణంలో నిమగ్నమైదని నేడు పాలకులు దేశంలో విద్యను ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కాషాయీకరణ చేసి పాలకులు చేతులు దులుపు కోవాలని చూస్తున్నారు.
నేడు విద్య అనేది అంగట్లో సరుకు లాగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. దేశంలో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి పేదలకు విద్యను దూరం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆయన విమర్శించారు.
విదేశీ యూనివర్సిటీలను దేశంలోకి తీసుకొచ్చి స్వదేశీ యూనివర్సిటీలను నాశనం చేయాలని చూస్తున్నారు ఆయన అన్నారు అనంతరం ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డుపల్లి అర్జున్, బలుముల ప్రేమ్ కుమార్,ఎనిమల్ల మహేష్, జువ్వ కొండల్ ,వలమల్ల రమేష్, చక్కని సంధ్య, శ్రీజ, బి. కొండల్,లక్ష్మణచారి, శ్రీను, రఘు, వెంకటేష్,మధు, అరవింద్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.