అనవసరంగా ఎవర్నీ పోలీసు స్టేషన్ లాకప్ లలో ఉంచుకోవద్దని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్ఠర్ ఫక్కీరప్ప కాగినెల్లి పోలీసు అధికారులను ఆదేశించారు. విచారణ కోసం తప్పనిసరిగా పోలీసు స్టేషన్లకు పిలిపించినా చట్టపరంగా వ్యవహరించాలని, ఏదేని కేసులో నిందితులైనా 24 గంటల్లోపు కోర్టు ముందు హాజరు పరచాలని ఆయన అన్నారు.
ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అని ఆయన హెచ్చరించారు. నేడు బెళుగుప్ప పోలీసు స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాలు… పోలీస్ స్టేషన్లోని లాకప్ గది, కంప్యూటర్ గది, ప్రాపర్టీ రూం, రిసెప్సన్ సెంటర్ , తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం… పోలీసు స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను సమీక్షించారు. పోలీసు స్టేషన్లో జి.డి ( జనరల్ డైరీ )ను ఎస్సై మాత్రమే రాయాలని సూచించారు.
CCTNS లో సి.సి నంబర్లు, కేసుల డిస్పోజల్ , తదితర వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. సైబర్ పోర్టల్ లలో తరుచూ లాగిన్ అయ్యి ఏవేని సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే తక్షణమే స్పందించాలి. ఇతర ప్రభుత్వ విభాగాలతో కలసి బాల్య వివాహాలపై ప్రజల్లో అవగాహన తేవాలి. బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలి అని ఆయన ఆదేశించారు. మిస్సింగ్ కేసులు, మహిళలు,చిన్న పిల్లలపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు,
అక్రమ నాటు సారా తయారీ, విక్రయాలపై మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే పిటీషనర్ల పట్ల మర్యాదగా, జవాబుదారీగా వ్యవహరించాలి. చట్టపరిధిలో సమస్యలకు పరిష్కరం చూపాలి. సిబ్బందితో మాట్లాడి సాధక బాధకాలు తెలుసుకుని విధుల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్ధేశం చేశారు. క్రమశిక్షణారహితంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీతో పాటు ఉరవకొండ రూరల్ సి.ఐ శేఖర్, బెళుగుప్ప ఎస్సై రామకృష్ణయ్య, తదితరులు ఉన్నారు.