ఆంధ్రా కేడర్ ఐపీఎస్ అధికారి అయిన అంజనీ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
అంజనీ కుమార్ ప్రవర్తన పై విచారణ జరపాలని గవర్నర్ ని కోరామని అనంతరం ఆయన మీడియాతో తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం అంజనీ కుమార్ ను ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయించారని అయినా ఆయన ఇక్కడే కొనసాగుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అంజనీ కుమార్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయని వాటిపై విచారణ జరపాలని కోరారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి నాయకులను పార్టీలు మార్పిస్తున్నారని ఉత్తమ్ అన్నారు. తెలంగాణ సిఎం కేసీఆర్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎల్బీనగర్ నుంచి సరూర్ నగర్ వరకు ఆర్ఎస్ఎస్ కి ర్యాలీ అనుమతి ఎలా ఇచ్చింది? దారుసల్లామ్ లో ఎంఐఎం కి అనుమతి ఎలా ఇచ్చారు?కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదు అని ఆయన ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ పై గవర్నర్ కి ప్రత్యేక అధికారాలు ఉన్నాయని అందువల్ల చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ గవర్నర్ ను కోరారు.