ఫిబ్రవరి 18వ తేదీన కోటప్పకొండలో జరగనున్న మహాశివరాత్రి తిరుణాళ్ల సందర్భంగా చేపట్టవలసిన బందోబస్తు,ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్ల గురించి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోటప్పకొండపై గల సమావేశ మందిరంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశానికి హాజరైన గుంటూరు రేంజ్ ఐజీ డా.CM త్రివిక్రమ వర్మ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగులో ఉన్న కేసుల పురోగతిని,వాటికి గల కారణాలను అరాతీసి,త్వరితగతిన సదరు కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని ఐజీ ఆదేశించారు.
ప్రతి గ్రామంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ,శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా చూడాలని తెలిపారు. పోక్సో కేసులు, ఎస్సి, ఎస్టీ కేసులు,మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, ప్రమాదాల నివారణకు కొరకు ఆయా ప్రాంతాల్లో వేగనియంత్రికలు,ప్రమాద హెచ్చరిక చిహ్నాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో గస్తీ ముమ్మరం చేసి,దొంగతనాలు నివారణకు కృషి చేయాలని తెలిపారు.ముఖ్యంగా జైలు నుండి విడుదలైన ముద్దాల కదలికలపై నిరంతర నిఘా పెట్టాలని సూచించారు. ఛాయా చిత్రాల ప్రదర్శన ద్వారా కోటప్పకొండ తిరుణాళ్ల జరిగే ప్రాంతాలను,కొండకు వచ్చే మార్గాలను,వాహనాలు నిలుపు పార్కింగ్ స్థలాలను ఆయా గ్రామాల నుండి వచ్చు ప్రభలు నిలుపు స్థలాలను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చేపట్టవలసిన చర్యల గురించి,
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి పోలీస్ అధికారులతో చర్చించారు. తిరుణాళ్లకు ఆయా గ్రామాల నుండి వచ్చే ప్రభల వివరాలు సేకరించాలని,శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే తిరుణాళ్ల కావున భక్తులు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి పోలీస్ అధికారి సమన్వయం కలిగి సమష్టిగా కృషి చేసి,భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐజీ, ఎస్పీలతో పాటు అదనపు ఎస్పీలు G.బిందుమాధవ్, రామచంద్రరాజు, డిఎస్పీలు, సీఐలు మరియు ఎస్సైలు పాల్గొన్నారు.
ఎం ఎస్ సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా