42.2 C
Hyderabad
May 3, 2024 15: 08 PM
Slider ముఖ్యంశాలు

భయపడవద్దు అలా అని నిర్లక్ష్యం కూడా వద్దు

#Telangana CM KCR

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కరోనా వైరస్ సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని, ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉందని సిఎం వెల్లడించారు.

కరోనా వ్యాప్తి నివారణలోనూ, చికిత్స లోనూ ఎంతో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముర్తాజా రిజ్వి, ఆరోగ్యశాఖ వివిధ విభాగాధిపతులు కరుణాకర్ రెడ్డి, రమేశ్ రెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మృతులు తక్కువే

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది. కేవలం తెలంగాణలోనే లేదు. తెలంగాణలో పుట్టలేదు. జాతీయ సగటుతో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉన్నది. రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉన్నది.

రాష్ట్రంలో గురువారం నాటికి ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్న వారు 3,692 మంది ఉన్నారు. వారిలో తీవ్రమైన ఇతర జబ్బులున్న 200 మంది తప్ప మిగతా వారంతా కోలుకుంటున్నారు. రాష్ట్రంలో గురువారం నాటికి 41,018 మందికి వైరస్ సోకింది. అందులో 27,295 మంది (67శాతం) కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు.

లక్షణాలు లేని వారికి కూడా పరీక్షలు చేస్తున్నాం

మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు లేని 9,636 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారు. మిగతా వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారంతా వేగంగా కోలుకుంటున్నారు. లక్షణాలు లేనప్పటికీ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వైరస్ సోకిన వారందరి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన గైడెన్స్ తో చికిత్స అందిస్తున్నాం.

దేశంలో అన్ లాక్ ప్రక్రియ నడుస్తున్నది. ప్రజలు పనుల కోసం బయటకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలు కూడా నడపాలని నిర్ణయించింది. కరోనాతో సహజీవనం చేయక తప్పని స్థితి వచ్చింది. అయితే కరోనా విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మాస్కు మరీ ముఖ్యం

మరీ అంత భయంకరమైన పరిస్థితి లేదు. అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండాలి. తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉంది.

కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వమే మొదట గందరగోళంలో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కావాల్సినవన్నీ చాలా వేగంగా సమకూర్చుకున్నాం. ఇప్పుడు వేటికీ కొరతలేదు. హైదరాబాద్ లోని గాంధి, టిమ్స్ లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి.

ఆక్సిజన్ సౌకర్యంతో 5 వేల పడకలు సిద్ధం

రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 వేల బెడ్లను సిద్ధం చేశాము. అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించి పెట్టాము. ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి.

మందులు, ఇతర పరికరాల కొరత లేదు. ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి.

ప్రయివేటు ఆసుపత్రులు పారదర్శకంగా ఉండాలి

ప్రజలకు మెరుగైన వైద్యం సమర్థవంతంగా అందించే విషయంపైనే వైద్య సిబ్బంది ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రైవేటు ఆసుపత్రులు బెడ్ల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.

ప్రతీ ఆసుపత్రి తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే విషయాలను బహిరంగ పరచాలి. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వివరాలు తెలియచేయాలని ఆయన ఆదేశించారు.

Related posts

డిస్నీ+ హాట్‌స్టార్ లో ప్రసారం కానున్న ‘ఆర్ యా పార్’

Bhavani

ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకపోతే ఉద్యమo

Murali Krishna

ప్రాధమిక పాఠశాలలో ఇక నుంచి మోగుతుంది వాటర్ బెల్

Satyam NEWS

Leave a Comment