ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ వైద్య విద్య కోసం సిద్ధం అవుతున్న ఒక యువతి అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డది. అనంతపురం జిల్లా హిందూపురం లో ఈ దుర్ఘటన జరిగింది. వైసీపీ నాయకుడు హిందూపురంలోని 1వ వార్డు కౌన్సిలర్ అయిన మల్లికార్జున కుమార్తె సుప్రియ (25) కర్నూలులోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
అనంతరం ఇంటి వద్ద ఉండి పీజీ వైద్య విద్య కోసం సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలో తాను ఎంపిక చేసుకున్న విభాగంలో సీటు దక్కుతుందో లేదోననే ఆందోళనతో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆమె ఇంటి మేడపైన ఉన్న గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గమనించిన తండ్రి మల్లికార్జున ఫిర్యాదు మేరకు హిందూపురం వన్ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.