కరోనా క్లిష్ట సమయంలో మాస్కులు అడిగిన పాపానికి పిచ్చి ఆసుపత్రి పాలైన నర్సీపట్నం ఎనస్తటిస్టు డాక్టర్ సుధాకర్ కు చికిత్స అందించే వైద్యుల్ని మార్చారు. పిచ్చి లేకపోయినా తనకు సంబంధిత మందులు ఇస్తున్నారని, ఆ మందులు తీసుకున్నప్పటి నుంచి కాళ్ల వాపులు, పెదాలు చిట్టిపోవడం, గొంతులో పుండ్లు రావడం జరుగుతున్నదని డాక్టర్ సుధాకర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ విషయాలను రాష్ట్ర హైకోర్టులో కూడా ఆయన ప్రస్తావించారు. వాడుతున్న మందులపై డాక్టర్ రామిరెడ్డి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని తనకు అందిస్తున్న చికిత్సపై అనుమానం ఉందని డాక్టర్ సుధాకర్ పలుమార్లు చెప్పారు. డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయి మాట్లాడుతూ తన కుమారుడిపై స్లో పాయిజన్ ప్రయోగం జరుగుతోందని చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.
తమ కుమారుడిపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులు, తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో రామిరెడ్డి స్థానంలో మరో మహిళా వైద్యురాలిని నియమించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి పర్యవేక్షణలో డాక్టర్ మాధవీలత ఆయనకు వైద్యసేవలు అందించనున్నట్టు అధికారులు తెలిపారు.