ఆదిలాబాద్ పట్టణంలో మతిస్థిమితం లేని 45 సంవత్సరాల వ్యక్తి మృతి చెందినట్లు సిఐ తెలిపారు. ఒకటవ పట్టణ సీఐ వి. సురేష్ తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా పట్టణంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి పట్టణంలోని పలు కాలనీలలో తిరుగుతూ చెత్త కాగితాలు ఏరుకుంటూ ఉండేవాడని, శనివారం ఉదయం మల్టీ పర్పస్ మైదానం ఫాస్ట్ ఫుడ్ షాపుల వద్ద అపస్మారక స్థితిలో ఉన్నాడని సమాచారం తెలుసుకొని సంఘటనా స్థలానికి ఎస్సై జి.అప్పారావు చేరుకోగా గుర్తు తెలియని వ్యక్తి అప్పటికే మృతి చెంది ఉన్నట్లు పేర్కొన్నారు.
సుమారు 45 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి అతని ఒంటిపై లైనింగ్ షర్టు, నీలం రంగు ప్యాంటు తొడిగి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతునికి ఎలాంటి గాయాలు లేవని, తీవ్రమైన ఎండ వేడికి తట్టుకోలేక వడదెబ్బతో మృతి చెందినట్లు తెలుస్తోందని తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మరణానికి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు.