భారతీయ జనతా పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాలతో పాటు ప్రతి కార్యకర్త ఇంటి పై పార్టీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.
బీజేపీ కార్యకర్తలు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దిన్ దయల్ ఉపాధ్యాయ చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించాలని ఆయన కోరారు. అదే విధంగా లాక్ డౌన్ ఎదుర్కొంటున్న ప్రజలకు సంఘీభావంగా బీజేపీ కార్యకర్తలు ఒక్క పూట భోజనం మనేయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.
ఫీడ్ ది నీడ్ లో భాగంగా ప్రతి కార్యకర్త 5 + 1 పేదలకు అన్నదానం చెయ్యాలని ఆయన కోరారు. లాక్ డౌన్ లో అత్యవసర సేవలు అందిస్తున్న వారికి కార్యకర్తలు మీ ఏరియాలో ఉన్న 40 మందితో సంతకాలు సేకరించి థాంక్యూ లెటర్స్ ని ఉద్యోగులకు ( కరోనా వారియర్స్ ) పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ఆయన కోరారు.
ప్రతి కార్యకర్త మాస్కులను ఇంట్లో తయారు చేయించి మరో ఇద్దరికి అందించేలా వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని, పార్టీ కార్యక్రమాలను సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయాలని బండి సంజయ్ కోరారు. లాక్ డౌన్ ముగిసే వరకు బీజేపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అన్నదానం, సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.