ఆదిలాబాద్ పట్టణంలో విచ్చలవిడిగా నిషేధిత గుట్కా అమ్ముతున్న నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 30 వేల రూపాయల విలువైన నిషేధిత గుట్కా ను స్వాధీనం చేసుకున్నట్లు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ.చంద్రమౌళి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు పకడ్బందీ వ్యూహంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్కాపై నిఘా వేసి విస్తృత దాడులు చేపడుతున్నారు.
ఇందులో భాగంగా పట్టణంలోని పలుచోట్ల కిరాణా షాపులో నిషేధిత గుట్కా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సి సి ఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోపలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో తిర్పెల్లి, పంజేషా కాలనీ లోని కిరాణా షాపుల యజమానులైన చింతకుంట్ల వార్ సుధాకర్, అందంవార్ రఘు ఎలియాస్ రాజు, మహమ్మద్ జిషాన్ ఉన్నారు.
వీరు తమ కిరాణా షాపుల్లో దొంగచాటుగా నిషేధిత గుట్కా విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు ఒకటో పట్టణ ఎస్సై జి. అప్పారావు తో కలిసి తనిఖీలు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వారి నుండి 22 వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
అనంతరం దస్నాపూర్ కాలనీలో మవాల ఎస్ఐ రమేష్ కుమార్ తో కలిసి కడ్డే ప్రఫుల్ (35) కిరాణా షాపులో తనిఖీలు చేపట్టి ఎనిమిది వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై మావాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచనున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అధికారులు ఎస్కే తాజుద్దీన్, మహమ్మద్ సిరాజ్ ఖాన్, ఎం ఏ కరీం, మంగల్ సింగ్, సయ్యద్ రహత్, మహిళా కానిస్టేబుల్ కె. మమత పాల్గొన్నారు.