చదువుకుంటేనే ఎవరి జీవితమైనా రాణిస్తుందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. స్టోన్ హౌస్పేటలోని బివిఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు టాబుల పంపిణీ కార్యక్రమంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతికంగా ఎదగాలని, అప్పుడే పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోగలరని తెలిపారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్మోహన్రెడ్డి నాడు-నేడు కింద స్కూళ్లలో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. గతంలో ఈ స్కూలు ఆవరణ కనిపించేది కాదని, ఇప్పుడు ఇండోర్ స్టేడియంతో సహా పలు నిర్మాణాలు జరిగి అద్భుతంగా తయారైందని తెలిపారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ కృషి ఎంతో ఉందని కొనియాడారు.
అనిల్ చాలా మంచి కార్యక్రమాలు చేసినా చెప్పుకోరని, అయితే ప్రజలే వాటిని గుర్తించి ఆయనను ఆశీర్వదిస్తారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 120 మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎంపీ ఆదాల టాబుల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డిప్యూటీ మేయర్ ఖలీల్, కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, నరసింహారావు, మైపాడు అల్లబక్షు, మధు తదితరులు పాల్గొన్నారు.