వచ్చే సాధారణ ఎన్నికలకు ఏర్పాట్లు వేగం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి రెవిన్యూ, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విధులు అత్యంత ప్రధానమైనవని అన్నారు. రిటర్నింగ్ అధికారి, ఎసిపిలు వారి వారి నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్, రిషిప్షన్, ఇవిఎం స్ట్రాంగ్ రూమ్ ల కేంద్రాలను అన్ని విధాలుగా పరిశీలించి, అనువైన వాటికి ప్రతిపాదనలు లే అవుట్ తో సహా సమర్పించాలన్నారు.
జిల్లాలో 12 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటుచేస్తున్నట్లు, ఆయా కేంద్రాల్లో సిబ్బంది కేటాయింపు షిఫ్ట్ ల వారిగా పూర్తి చేయాలన్నారు. తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, వసతులు, భద్రతపై చర్యలకు కార్యాచరణ చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిశీలన చేసి, ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్.ఎస్.టి. ల ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు ఎన్నికల విధుల్లో దృష్టి పెట్టాలని, ఎక్కడా ఎలాంటి చిన్న తప్పిదం జరగకుండా ఎన్నికలు పూర్తికి చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్లో 19 సిసి టివి కెమెరాల ఏర్పాటు ఉండాలని, అవన్నీ పనిచేయు స్థితిలో ఉండాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్, పోలీస్ కమీషనర్ తో కలిసి సిసి టివి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిసి కెమెరా డాటా ని ప్రతి నెలకు ఒకసారి ప్లే చేసి చూసుకోవాలన్నారు.
మార్గదర్శకాల మేరకు సిసి కెమెరా బ్యాక్ ఆప్ చేపట్టాలని ఆయన తెలిపారు. వచ్చే సమావేశానికి బ్యాక్ ఆప్ డేటాతో రావాలని పొలీస్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు డిసిపి కె.ఆర్. కె. ప్రసాద్ రావు, ఆర్డీవోలు జి. గణేష్, అశోక్ చక్రవర్తి, ఎస్డీసి రాజేశ్వరి, ఎసిపిలు, సిఐలు తదితరులు పాల్గొన్నారు.