దిశ హత్య కేసులో చట్టానికి లోబడి పోలీసులు వ్యవహరించిన తీరును స్వాగతిస్తున్నామని బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వ్యాఖ్యానించారు. అతి క్రూరంగా వ్యవహరించిన ఆ నలుగురు నిందితులను ఉరి శిక్ష వేయాలని ప్రతి ఒక్క పౌరుడు ముక్తకంఠంతో నినదించారని ఆమె గుర్తు చేశారు.
2008లో వరంగల్ నగరంలో యాసిడ్ దాడి నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తర్వాత అటువంటి సంఘటనలు మరల పునరావృతం కాలేదని గుర్తుచేశారు. దిశ ఘటనలో నలుగురిని ఎన్ కౌంటర్ చేయడం మరోసారి కామాంధులకు హెచ్చరికలు జారీ చేసినట్లేనని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
ఈ సంఘటనతో మరోమారు మహిళల పై అత్యాచార సంఘటనలు పునరావృతం కావని అన్నారు. ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకున్నపుడు మాత్రమే పోలీసులు ప్రజల భద్రత పట్ల భరోసా కలిపించినట్లు అవుతుందని, అలా కాకుండా అమాయక ఆడపిల్లలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
అమాయకమైన దిశను మనం ఎప్పటికీ తిరిగి పొందలేము. కానీ ఇంకెప్పుడైనా ఎవరైనా రేప్ గురించి కానీ.. మర్డర్ గురించి కానీ ఆలోచిస్తే.. వాళ్లు తదుపరి చర్యల గురించి కూడా గుర్తు చేసుకునేలా తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి నిందితులకు ఎన్ కౌంటర్ జరగడం సరైందేనని ఆమె తెలిపారు.