కేసీఆర్ ని ఓడగొడితేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని గజ్వేల్ బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం రాంపల్లి లో నేడు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులానికి మతానికి అతీతంగా ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుని అన్నం పెట్టేది భూతల్లి. ఆ భూమి మీద హక్కులు లేకుండా చేసినవాడు కెసిఆర్. ధరణి తీసుకొచ్చి కంట్లో మట్టి కొట్టాడు. పక్క రాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు 16 సంవత్సరాలకు, 18 సంవత్సరాలకు పట్టాలు ఇస్తుంటే.. ఇక్కడ మాత్రం గుంజుకుంటున్నారు.
దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తా అన్న కేసీఆర్ ఇచ్చారా? డబ్బులు బెడ్ రూమ్ కట్టిస్తా అన్నారు కట్టించారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? 57 సంవత్సరాల పెన్షన్ ఇస్తా అన్నారు… అది కాదు అసలు పెన్షన్ దిక్కులేదు. 2018 ఎన్నికల అప్పుడు నేనే జిమ్మిదార్ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్న అన్నారు. కానీ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మి, భూములు డబ్బులు తీసుకువచ్చి రుణమాఫీ వడ్డీలకు కట్టారు తప్ప అసలు తీరలేదు. మాటకు చేసే పనికి పొంతన లేని వ్యక్తి కేసీఆర్. ఓట్లు వేసి ముఖ్యమంత్రి చేసిన పాపానికి పేదవారికి రూపాయి సాయం చేయకపోగా ఉన్న భూములు గుంజుకొని కూలీలుగా మార్చిన వ్యక్తి కేసీఆర్ అని ఈటల రాజేందర్ అన్నారు. ఈ కర్మ పోవాలంటే మీ చేతిలోనే ఉంది. మీ ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యే అయ్యారు.. మీ ఓట్లతోనే ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ఓట్లు వేయకపోతే ఈ వేధింపులు ఆగిపోతాయి కాబట్టి దయచేసి గమనించండి అని అన్నారు.