అమరావతి ఉద్యమానికి నేటితో వెయ్యి రోజులు పూర్తయ్యాయి. అయినా ఏ మాత్రం స్పందించని జగన్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే ధ్యేయంతో అమరావతి రైతులు మహా పాదయాత్ర తలపెట్టారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకూ ఈ పాదయాత్ర సాగుతుంది.
నేటి తెల్లవారుజామున మహా పాదయాత్ర ప్రారంభం అయింది. మహాపాదయాత్ర అంకురార్పణ జరిగింది. వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతులు అనంతరం ఆలయం బయట ఉన్న వేంకటేశ్వరస్వామి వారి రథాన్ని నడిపి పాదయాత్రకు అంకురార్పణ చేశారు. అనంతరం రథాన్ని గ్రామంలోకి తీసుకెళ్లారు.
ఉదయం 9 గంటలకు జెండా ఊపి పాదయాత్రను లాంఛనంగా ప్రారంభించారు. అంకురార్పణ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అమరావతి పరిరక్షణ సమితి, రైతు జేఏసీ నేతలు పాల్గొన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర 1000 కిలోమీటర్లు సాగి నవంబరు 11న శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి చేరుకుంటుంది.