వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైకాపా కోట్ల రూపాయల ఖర్చుతో మల్టీ కలర్ బుక్ లెట్స్ ప్రచురిస్తోందని, ఇందులో మహనీయుల పేర్లు, మహానుభావుల కొటేషన్లను వాడుతోందని, వాటిని వెంటనే తొలగించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. జగనే ఎందుకు కావాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త అబద్దాలకు తెరలేపిందని, 24 పేజీల ప్రచార పుస్తకాలలో మహనీయులైన జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, నోబెల్ బహుమతి గ్రహీతలు అమర్త్యసేన్ , అభిషేక్ బెనర్జీ, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ వంటి వారి పేర్లను , ఫోటోలను, కొటేషన్లను వాడుతూ దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.
వెంటనే మహానుభావుల పేర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారి ఆత్మలు క్షోభిస్తాయని విచారం వ్యక్తం చేశారు.దేశ చరిత్రలో, చరిత్ర పుటల్లో, విప్లవం వంటి పదాలను కూడా వాడే నైతిక అర్హత లేదన్నారు. మహానుభావుల పేర్లకు బదులుగా రావణాసురుడు , బకాసురుడు, కుంభ కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు , తానీషా, ఔరంగజేబు వంటి పేర్లను, వారి ఫోటోలను బుక్ లెట్ లో వాడుకుంటే ఉత్తమంగా, సముచితంగా ఉంటుందని సలహా ఇచ్చారు. తండ్రి వైఎస్ఆర్ ఫోటోకు మంగళం పక్కన పెట్టి, చెల్లిని, తల్లిని దూరంగా పెట్టి, బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం చేయని ముఖ్యమంత్రి గూర్చి సలహాదారు సజ్జల ఎంత చెప్పినా దయ్యాలు వేదాలు వల్లించినట్లే అని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.