కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇంత కాలం ఈటల రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరగగా ఇప్పుడు బీజేపీ అధిష్టానం దాదాపుగా క్లియర్ చేయడంతో ఆయన బీజేపీ లో చేరడం ఖాయం గా మారింది. హుజూరాబాద్ లో ఎన్నికలు జరిగితే బిజెపి అభ్యర్థి గా తనకే అవకాశం ఉంటుందని భావించిన పెద్ది రెడ్డి, ఈటల కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధిష్టానంపై అలిగి పార్టీ మారడానికి కార్యకర్తలతో సమాలోచనలు చేస్తున్నాడు.
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రి గా అపారమైన అనుభవం, హుజూరాబాద్ తో పాటుగా తెరాస కార్యకర్తలతో సత్స సంబంధాలు ఉన్న పెద్దిరెడ్డి కి తగిన అవకాశాలు రాక ఇంతకాలం స్తబ్దంగా ఉండిపోయాడు. టిడిపి హయాంలో ఒక వెలుగు వెలిగిన పెద్దిరెడ్డి టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్ కే పరిమితమయ్యారు.
తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీలో చేరిన పెద్దిరెడ్డి బిజెపి పార్టీ పటిష్టానికి కృషి చేస్తూ వస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన పరిణామాలలో టిఆర్ఎస్ నుంచి ఈటెల దూరం కావడం ,మంత్రి పదవి నుండి బర్తరఫ్ కావడంతో ఈటల పై తెరాస నాయకత్వం ముప్పేట దాడి చేస్తున్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో ఈటెల తన రాజకీయ ప్రస్థానాన్ని పునర్మించుకునేందుకు గాను బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ ,కోదండరాం తో పాటు గా ఇతర వామపక్ష భావజాలం నాయకులతో వరుస సమావేశాలు జరుగుతూ వచ్చాడు.
రెండు రోజులుగా ఈటెల పై బిజెపి లో చేరవలసిందిగా కార్యకర్తల నుండి ఒత్తిడి రావడం తో పాటు బీజేపీ అధిష్టానం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బిజెపి వైపు మొగ్గు చూపాడు. బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయం కావడంతో ఇంతకాలం హుజూరాబాద్ సీటుపై కన్నేసిన పెద్ది రెడ్డి ని కనీసం మాట మాత్రంగా కైనా సంప్రదించకుండా అధిష్టానం ఈటలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అలిగిన పెద్దిరెడ్డి అధిష్టానం పై బహిరంగంగానే విమర్శలు చేశాడు.
అవసరమైతే పార్టీ నుండివెళ్ళల్సి వస్తే పెద్ద ఎత్తున కార్యకర్తలతో బయటకు పోవడానికి సిద్దమని ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందుకు టిఆర్ఎస్ లోని ఇద్దరు మంత్రులు పెద్దిరెడ్డి తో మంతనాలు జరిపి టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఇందుకు కెసిఆర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
హుజూరాబాద్ లో తెరాస క్యాడర్ చెదిరి పోకుండా ఉండాలంటే పెద్దిరెడ్డి నీ టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందని సదరు మంత్రులు కేసీఆర్ తో మంతనాలు సాగించినట్లు సమాచారం. దీంతో పెద్దిరెడ్డి సైతం తెరాస లో చేరడానికి ఒప్పుకున్నట్లు, ఈ మేరకు రెండు,మూడు రోజుల్లో నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
తెరాస అధిష్టానం సైతం కౌశిక్ రెడ్డి ని చేర్చుకుని ఈటెల పై ప్రయోగం చేస్తామని భావించినా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెద్దిరెడ్డి వైపే ఎక్కువగా ఉండటం తో కెసిఅర్ పెద్దిరెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పెద్దిరెడ్డి తెరాస లోకి వస్తున్నట్లు సమాచారం రావడంతో పెద్దిరెడ్డి అభిమానులతో పాటు తెరాస కార్యకర్తలు , నాయకులు పెద్దిరెడ్డి ని ఫోన్ లో సంప్రదిస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు.
మామిడి రవీందర్ గౌడ్, సత్యం న్యూస్, హుజూరాబాద్