వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కు సంబంధించి పలు ఆరోపణలు చేసిన సీనియర్ ఐపిఎస్ అధికారి ఏ బి వెంకటేశ్వరరావుపై మరో కేసు పెట్టేందుకు ఏపి పోలీసులు సమాయత్తం అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఆయన వెల్లడించిన వివరాలు క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తాయని డీజీపీ కార్యాలయం నేడు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. డీజీపీ కార్యాలయం నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటన పూర్తి పాఠం ఇది.
రక్షణ మరియూ అంతర్గత భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై సస్పెన్షన్ లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, డైరెక్టర్ జనరల్ ఏబి వెంకటేశ్వరరావు గారు మొన్న తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ సిబిఐ డైరెక్టర్ కి లేఖ రాయడం జరిగింది.
ఆ లేఖను పబ్లిక్ డొమైన్ లో పెట్టడం, లేఖలోని వివరాలను అందరికీ తెలిసే విధంగా బహిర్గతం చేయడం వల్ల ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి. ఆయన రాసిన లేఖ పై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి వాస్తవాలను తెలిపే క్రమంలో ఈరోజు డిజిపి కార్యాలయం అధికార ప్రతినిధిగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఆయన రాసిన లేఖలోని అంశాలను కూలంకషంగా పరిశీలిస్తే, 1) కడప మాజీ ఎంపీ శ్రీ వై.యస్.వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని తాను సి.ఐ.డి/ సిట్ అధికారులకు అందచేసినట్లు, అయితే అట్టి కీలక సమాచారాన్ని ఏ మేరకు ఉపయోగించుకున్నారో తనకు తెలియదనీ లేఖలో పేర్కొన్నారు.
2) అదే విధంగా ఈ హత్య కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని అందజేస్తానని సిబిఐ జాయింట్ డైరెక్టర్ N. M. Singh గారికి ఫోన్ ద్వారా రెండు సార్లు తెలిపినప్పటికీ, సంవత్సర కాలంగా వారు సరైన విధంగా స్పందించలేదనీ, డిజి స్థాయి అధికారి కేసు దర్యాప్తులో సమాచారం ఇస్తానన్నప్పటికీ అలా సుముఖత చూపకపోవడం శోచనీయమని సిబిఐ అధికారులను కూడా తప్పుబట్టారు.
అయితే వారు పేర్కొన్న అంశాలలో అసలు వాస్తవాలు ఏంటో చూస్తాం.
ఎంపీ వైయస్ వివేకానంద రెడ్డి గారి హత్య మార్చి 14 అర్ధరాత్రి 15 తెల్లవారు జామున జరిగింది. అయితే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారు సమాచారం అందుకున్న మరుక్షణం నుంచి స్థానిక పోలీసులు, సి.ఐ.డి, సిట్, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం అధికారులకు అప్పటి డీజీపీతో కలిసి అనుక్షణం ఆదేశాలు జారీ చేస్తూ, దర్యాప్తు మొత్తం తన కనుసన్నల్లోనే ఉంచుకొన్నారన్న విషయం అందరికీ తెలిసిందే.
హత్యానంతరం మార్చ్ 31 వరకు 17 రోజుల పాటు వారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొనసాగిన విషయం మీకందరికీ తెలిసిందే. ప్రతి రోజూ, ముఖ్యమంత్రి కాంప్ ఆఫీసు లో ఈ కేసు వివరాలను ముఖ్యమంత్రి మరియూ డిజిపి తో పంచుకోవడం, చర్చించడం, కేసు పురోగతిని సమీక్షించడం తో పాటు దర్యాప్తు ఎలా ముందుకు వెళ్లాలి అనేదానిపై అధికారులకు పూస గుచ్చినట్లు ఆదేశాలు జారీ చేసే వారు. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి సైతం ఏబీవీ గారు అందించిన విషయాలను రోజు వారీ మీడియాకు కూలంకషంగా వివరించే వారు.
అలా దర్యాప్తు మొత్తం ఏబీ వెంకటేశ్వరరావు గారి కనుసన్నల్లోనే జరిగింది. వారు తాను మార్చ్ 31 వరకు అనగా బదిలీ అయ్యే చివరి నిమిషం వరకు దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షి స్తూనే వున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూనే వున్నారు.
మరి అట్టి పరిస్థితుల్లో, తను ఇచ్చిన కీలక సమాచారాన్ని సిట్ లేదా సీఐడీ ఏ మేరకు ఉపయోగించుకొందో తనకు తెలియదని చెప్పడం హాస్యాస్పదం.
ఇంకేదైనా కీలక సమాచారం వున్నా వారు ఆ సమాచారాన్ని అప్పుడే సిట్ కు ఎందుకు ఇవ్వలేదో సెలవివ్వాలి. హత్య జరిగిన తర్వాత కూడా తనకు సానుకూలం గా ఉన్న ప్రభుత్వమే అధికారంలో ఉంది గదా. మరి ఆ మూడు నెలలు వారు ఏమి చేసినట్లు?
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 9 నెలల పాటు సిట్ దర్యాప్తు కొనసాగింది. ఆ సమయంలోనైనా అట్టి కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు ఎందుకు ఇవ్వలేదో వారే సెలవివ్వాలి.
నిజానికి వారు వివేకానంద రెడ్డి హత్య జరిగిన మొదటి నుంచీ, వాస్తవాలు బయటకు తీసే విషయాన్ని పక్కకు పెట్టి, ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను, బంధువులను అరెస్ట్ చేయమని అప్పటి ఎస్పీ కి, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మాట వాస్తవం కాదా చెప్పాలి.
అప్పటి ఎస్పీని, ఇతర విభాగాలను తీవ్ర ఒత్తిడి కి గురి చేసిన మాట వాస్తవం కాదా చెప్పాల్సి ఉంది. నిబద్దత కలిగిన అధికారి కాబట్టే అప్పటి ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తీవ్ర ఒత్తిడి కి తలొగ్గలేదు. రాహుల్ దేవ్ గారు ఇప్పుడు ఇక్కడకు వచ్చి వున్నారు.
మరి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరావు గారు రెండు సంవత్సరాల తర్వాత సి.బి.ఐ, సి.ఐ.డి, సిట్ అధికారులపైన ఆరోపణలు చేస్తూ సిబిఐ డైరెక్టర్ కి లేఖ రాయడం హాస్యాస్పదం. అసమంజసం.
సాధారణ పౌరులు సైతం ఏదైనా నేరానికి సంబంధించిన కీలక సమాచారం తన వద్ద ఉంటే సంబంధిత దర్యాప్తు అధికారులకు అందించక పోవడం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అటువంటిది ఒక ఐపిఎస్ అధికారిగా ఉంటూ కీలకమైన కేసులో తన వద్ద ఉన్న కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు అందించకపోవడం Sec 201 IPC కింద శిక్షార్హం కాదా.
నిజంగానే తన వద్ద హత్య కేసుకు సంబంధించిన కీలక సమాచారం ఏదైనా ఉన్నట్లయితే వ్రాత పూర్వకంగా సీల్డ్ కవర్లో సిబిఐకి అందించాల్సి ఉంది.
కానీ కేవలం ఎన్నికల సమయంలోనే ఈ కేసుకు సంబందించిన విషయాలను ప్రస్తావిస్తున్న విషయాన్ని గమనించాల్సిన విషయం. గత సాధారణ ఎన్నికల్లో సైతం గౌరవ హైకోర్టు మార్చ్ 30 న GAG ఆర్డర్ ఇచ్చేవరకు ఏబీవీ గారు ఇచ్చిన సమాచారాన్ని అప్పటి ముఖ్యమంత్రి మీడియా తో ప్రతిరోజు పాలుపంచుకొనేవారు.
రెండవ విషయం..
రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడి ఏబీవీ గారు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ కేసులో ఏబి.వెంకటేశ్వరావు పై కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీ ఇటీవల కాలంలో 15 రోజుల పాటు విచారణ జరిపిన విషయం విదితమే. అయితే వారు కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీ వారికి రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సమర్పించిన వెంటనే అందులోని వివరాలను మీడియా కు వెల్లడించడం, సామాజిక మాధ్యమాల్లో పెట్టడం, స్టేట్మెంట్ లో పొందు పరిచిన వివరాలను ప్రజలకు బహిర్గతం చేయటం ఒక IPS అధికారిగా సమంజసం కాదు.
వారు ఆ క్రమంలో రాష్ట్రంలోని చాలా మంది IAS, IPS అధికారుల పైన పలు తప్పుడు ఆరోపణలు చేస్తూ చీఫ్ సెక్రటరీకి లేఖ రాయడం తోపాటు తాను చేస్తున్న ఆరోపణలపైన సిబిఐ ఎంక్వైరీ కూడా కోరారు. అదే విషయాన్ని మరలా ప్రజలకు బహిర్గతం చేశారు.
అయితే ఈ లేఖలో పేర్కొన్న ఆరోపణలను పరిశీలించిన అనంతరం వారు చేసిన ఆరోపణలు నిరాధారమైనవి మరియూ తప్పుడు ఆరోపణలు గా గా రూడీ కాబడ్డాయి. అయినా వారికి ఇంకెమన్నా అనుమానాలు ఉంటే, పద్దతి ప్రకారం, ప్రొసీజర్ మేరకు సంబంధిత అధికారులతో నివృత్తి చేసుకోవాలి తప్ప ఇలా సహచర అధికారుల పైన బహిర్గతంగా ఆరోపణలు చేయడం సమంజసం కాదు.
దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది ఖందించ దగ్గ విషయం. అంతేకాకుండా ప్రభుత్వం పైన, ప్రజా ప్రతినిధుల పైన బహిర్గతంగా లేని పోని ఆరోపణలు గుప్పించడం ఆల్ ఇండియా సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం మిస్ కాండక్టు క్రిందకు వస్తుంది.
అధికార ప్రతినిధి
ఏ పీ పోలీస్ హెడ్ క్వార్టర్స్
ఆంధ్రప్రదేశ్