జూన్ నెల మధ్యలోకి వచ్చినా.. ఇంకా ఎండలు ఏ మాత్రం తగ్గలేదు. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 11 దాటితే రోడ్లన్నీ అనేక చోట్ల కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లను తిరిగి ప్రారంభించడం పేరెంట్స్ లో ఆందోళన పెంచుతోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే స్కూళ్లను ప్రారంభించారు. ఎండ కారణంగా వేసవి సెలవులను కనీసం ఓ వారమైనా పొడిగించాలని పేరెంట్స్ కోరినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో అనేక మంది తమ పిల్లలను ఇంకా స్కూళ్లకు పంపించడం లేదు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి రాష్ట్రంలో జూన్ 16వ తేదీ నుంచి వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు ప్రారంభించాల్సి ఉంది. అయితే.. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వేసవి సెలవులను మరో 10 రోజులు పొడిగించాలని ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు.
జూన్ 26 నుంచి స్కూళ్లను తిరిగి ప్రారంభించాలని ఆదేశాల్లో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎండవేడితో చిన్నారులు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. సీఎం ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.