విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు, అతని భార్య కిడ్నాప్ కలకలం రేపింది. రుషికొండ సమీపంలోని బేమౌంట్ ఎదురుగా ఉన్న ఇంట్లోకి చొరబడిన కిడ్నాపర్లు ముందుగా ఎంవీవీ కుమారుడు చందు, ఎంపీ బార్య జ్యోతిని బంధించారు. ఆపై వారితో ఆడిటర్ జీవీకి ఫోన్ చేయించి ఆయనను కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్ నకు ప్రధాన కారకుడైన రౌడీషీటర్ హేమంత్ రూ. 50 కోట్లు డిమాండ్ చేశాడు. పోలీసులకు సమాచారం అందండంతో రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల్లోనే కేసును చేధించారు. కిడ్నాప్ నకు గురైన ముగ్గురి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. భీమిలి ప్రాంతానికి చెందిన వెంకట హేమంత్ అనే రౌడీ షీటర్ మధుసూదన్ అనే రియల్టర్ను మోసం చేసేందుకు పన్నాగం పన్నాడు.
తన ఫ్లాట్ అమ్ముతానని చెప్పడంతో రూ.30 లక్షల కమీషన్ ఇస్తే తాను అమ్మిస్తానని నమ్మబలికి ఆ తర్వాత కారులో దూరంగా తీసుకెళ్లి హేమంత్ అండ్ కో మధుసూదన్ను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత డబ్బులిస్తేనే విడిచి పెడతానని హెచ్చరించారు. భయపడిన బాధితుడు తన ఖాతాలో ఉన్న రూ.7.5 లక్షల వరకు నగదు వీరి ఖాతాకు బదిలీ చేశాడు.
అంతేనా మధుసూదన్ వద్ద ఉన్న బంగారం, ఫోన్ కూడా తీసుకుని పరారయ్యారు. మధుసూదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్లో దాక్కున్న హేమంత్ బృందాన్ని పట్టుకున్నారు.
మరో 10 మందితో కలిసి హేమంత్ కిడ్నాప్ నకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో అప్పలరాజు.. రాంబాబు అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఉండడం గమనార్హం.
ఈ ఇద్దరూ అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ కేసులో గతంలో అరెస్ట్ అయ్యారని సీపీ తెలిపారు. జైలులో పరిచయం అయిన హేమంత్ డబ్బు కోసమే ఈ కిడ్నాప్నకు పన్నాగం పన్నాడని తెలుస్తోంది. టీడీపీ నేత, బిల్డర్ పాచి రామకృష్ణను కూడా హేమంత్ కిడ్నాప్ చేశాడు. ఓ ల్యాండ్ లావాదేవీ వ్యవహారంలో కిడ్నాప్నకు పాల్పడ్డాడు. రూ.కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. అప్పుడు కూడా పీఎం పోలీసులు రంగం ప్రవేశం చేసి హేమంత్పై కేసు నమోదు చేశారు.