విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషనులో ఎస్ఐలుగా పని చేసి, గరివిడి, గుర్ల పోలీసు స్టేషనుకు బదిలీ అయిన ఎస్ఐలకు విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషనులో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించడం చాలా కష్టమని, రహదారులు విశాలంగా లేకపోవడం, వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడం, ఫుట్ పాత్, తోపుడు బండ్ల వ్యాపారాలతో ముఖ్య కూడళ్ళు రద్దీగా ఎప్పుడూ ఉంటాయన్నారు.
అంతేకాకుండా, తీవ్రమైన ఎండలు, వర్షాలతో ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొని విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. బదిలీ అయిన ఎస్ఐలు దామోదర్, హరిబాబు నాయుడులు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొంటూ, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమర్ధవంతంగా విధులు నిర్వహించే వారన్నారు. యువకులైన ఇద్దరు ఎస్ఐలు ఒకేసారి బదిలీ కావడం ట్రాఫిక్ పోలీసు స్టేషనుకు ఇబ్బందికరమైనప్పటికీ జిల్లాలో కీలకమైన గరివిడి, గుర్ల పోలీసు స్టేషనుల శాంతిభద్రతల విభాగానికి బదిలీ కావడం, వారి పని తనానికి నిదర్శమన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో శాంతిభద్రతల విభాగంలో ఇంకా మెరుగైన సేవలందించి, ప్రజలు, ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు ఆంకాక్షించారు.
అనంతరం, ట్రాఫిక్ నుండి గరివిడికిబదిలీ అయిన దామోదరరావు, గుర్లకు బదిలీ అయిన హరిబాబు నాయుడులను డిఎస్పీ ఎల్.మోహనరావు శాలువలతో సత్కరించి, పుష్ప గుచ్ఛాలను అందజేసి, ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బదిలీ అయిన ఎస్ఐలు దామోదర్, హరిబాబు నాయుడు మాట్లాడుతూ ట్రాఫిక్ డిఎస్పీ ఆధ్వర్యంలో పని చేయడం, వారి అనుభవాల నుండి ఎన్నో పాఠాలను నేర్చుకున్నామని, విధి నిర్వహణలో ట్రాఫిక్ సిబ్బంది తమకు అన్ని వేళలా సహకరించారన్నారు.
కొన్ని సందర్భాల్లో ఎవరి పట్ల అయినా దురుసుగా ప్రవర్తించి ఉంటే, అది విధి నిర్వహణలో భాగమేనన్న విషయంగా పరిగణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు లోవరాజు, త్రినాధరావు, గరివిడి ఎస్ఐ దామోదర్, గుర్ల ఎస్ఐ హరిబాబు నాయుడు, ట్రాఫిక్ ఎఎస్ఐలు నూకరాజు, నాగాదిత్య, రామకృష్ణ మరియు ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.