హైటెన్షన్ మధ్య కొనసాగుతున్న బంద్
రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, రైతు జెఎసి పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలో బంద్ కొనసాగుతోంది. ఇప్పటికే విద్య, వ్యాపార వాణిజ్య సంస్థలు రైతులకు మద్దతుగా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. కొన్ని చోట్ల ఓపెన్ ఉన్న దుకాణాలు, పెట్రోల్ బంకులను శాంతియుతంగా మూసివేయిస్తున్నారు. ఈ క్రమంలో నిజాంసాగర్ చౌరస్తాలో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 50 మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేసి డిసిఎం వ్యానులో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతుల అరెస్ట్ నేపథ్యంలో కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. శాంతియుతంగా బంద్ కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను అరెస్ట్ చేయడం పట్ల పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల భూములను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే ఆ రైతులనే అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్నలు సందిస్తున్నారు. మరో వైపు బంద్ ను భగ్నం చేసేందుకు పోలిసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసు పహారా కొనసాగుతోంది. నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.