కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిసహద్దుల్లో ఏడాదికిపైగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ 19న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.
శీతాకాల సమావేశాల తొలిరోజున చట్టాల రద్దుపై తీర్మానం కూడా జరిగింది. అయితే.. పంటల కనీస మద్దతు ధరపై స్పష్టతనివ్వాలని.. కేసులు ఉపసంహరించుకోవాలని.. ఉద్యమంలో మరణించిన వారికి పరిహారం చెల్లించాలన్న డిమాండ్లతో రైతు సంఘాలు ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి.
అయితే.. వీటిపై కూడా సానుకూలంగా స్పందిస్తామని, ఎంఎస్పీ ధరపై కమిటీ వేస్తామని, ఆందోళన విరమించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. అయితే.. తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి. ఆందోళనలు విరమించడం లేదని.. వాయిదా మాత్రమే వేస్తున్నామని రైతు సంఘాల అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ వెల్లడించారు.