ఖతార్లో జరుగుతున్న ఫుట్బాల్ ప్రపంచకప్ వేదికపై అపశృతి చోటు చేసుకుంది. ప్రపంచ కప్ కోసం నిర్మించిన క్రీడా గ్రామం (ఫ్యాన్ విలేజ్) సమీపంలో మంటలు చెలరేగాయి. దేశంలోనే అతిపెద్ద లుసైల్ స్టేడియం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం తరువాత, ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ విషయమై అధికారులతో మాట్లాడగా నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగిందని చెప్పారు.
మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఎవరికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. ఖేల్ గ్రామం వైపు పొగ కదలడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. జనం ఆ స్థలం నుండి పరుగులు తీయడం ప్రారంభించారు. అయితే, అగ్నిప్రమాదం ప్రభావం పెద్దగా లేదని పోలీసు యంత్రాంగం వివరించింది.
లుసైల్ నగరంలో భాగమైన ఓ ద్వీపంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం తర్వాత మంటలు చెలరేగాయని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. టోర్నీ సందర్భంగా లుసైల్ అనేక మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడ శనివారం అర్థరాత్రి అర్జెంటీనా మెక్సికోతో తలపడనుంది. మంటలు లుసైల్ స్టేడియం నుండి 3.5 కిలోమీటర్లు (2 మైళ్ళు) దూరంలో ఉన్నాయి.